ఒక సమయంలో టాలీవుడ్ లో బాక్సాఫీస్ను స్టార్లు శాసించే వారు. తొలినాళ్లలో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ అయినా, సూపర్స్టార్ కృష్ణ అయినా,. ఆ తరువాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ల తరం అయినా సరే స్టార్ల ప్రభావం ఎప్పుడూ బాక్సాఫీస్ వద్ద ఉండేది.
కానీ అయితే మారుతున్న కాలంతో పాటు వినోదాన్ని ప్రేక్షకులు వినియోగించే మాధ్యమాలు చాలా అభివృద్ధి చెందడంతో, ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. అందువల్లే ఇప్పుడ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలి అంటే కేవలం స్టార్ ట్యాగ్ మాత్రమే సరిపోదు. స్టార్ హీరోల వల్ల ఓపెనింగ్స్ వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కంటెంట్ బాగుంటేనే సినిమా విజయం సాధిస్తుంది. ఉదాహరణకు రంగస్థలంతో అద్భుతమైన విజయం సాధించిన రామ్ చరణ్, తరువాత వచ్చిన వినయ విధేయ రామ సినిమాతో అపజయాన్ని మూటగట్టుకున్నారు. సినిమాలో విషయం లేకపోతే ఎంత పెద్ద స్టార్ ఉన్నా ఆ స్టార్ డం సినిమాను కాపాడటం సాధ్యం కాదు.
చిరంజీవి, నాగార్జున, నాని, నాగ చైతన్య, నితిన్, రామ్, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు ఇటీవల తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అలాగే ట్రేడ్ వర్గాల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. కొన్ని సినిమాలకైతే కనీస స్థాయిలో కూడా కలెక్షన్లు రాకపోవడం గమనార్హం. ఇక కొన్ని సినిమాలకు పాజిటీవ్ టాక్ వచ్చినా కూడా సరైన విధంగా ప్రభావం చూపలేకపోయాయి.
కానీ మేజర్, సీతారామం, కార్తికేయ 2 వంటి చక్కని సినిమాలకు తోడు ఇటీవల విడుదలై బ్లాక్బస్టర్ గా నిలిచిన కాంతార వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరైన కంటెంట్ ఉన్న సినిమాలే ఎప్పుడూ పని చేస్తాయని రుజువు చేశాయి. ముందుగానే అనుకున్నట్లు.. తెలుగు ప్రేక్షకులు మునుపటి కాలంతో పోలిస్తే బాగా అభివృద్ధి చెందారు. సినిమాల నుంచి నాసిరకం అంశాలు కాకుండా నాణ్యతను ఆశిస్తున్నారు.
కనుక సినిమాల ఫలితాల ద్వారా ప్రేక్షకులు ఇస్తున్న సంకేతాన్ని మన తారలు పసిగట్టి.. రాబోయే తమ సినిమాలలో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మంచి సినిమాలతో వస్తారని ఆశిద్దాం.