ప్రభాస్ హీరోగా తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ లవ్ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది.
అయితే తాజాగా కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపధ్యలో పాకిస్థానీ నటీ నటులు భారతీయ చిత్రాల్లో నటించడం పై పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ హను మూవీలో చేస్తున్న ఇమాన్వి ఒక పాకిస్థానీ అమ్మాయి అని, ఆమెను సినిమా నుండి తీసివేయాలని పలువురు పోస్టులు పెడుతున్నారు.
అయితే నేడు కొద్దిసేపటి క్రితం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇమాన్వి క్లారిటీ ఇచ్చారు. కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిలో మరణించిన వారికి నా ప్రగాఢ సానుభూతి చెప్పుకుంటున్నాను. నా ఐడెంటిటీ మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అందుకే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది.
పాకిస్తాన్ నాకు ఎలాంటి సంబంధం లేదు. నా కుటుంబ సభ్యులకు కూడా పాకిస్తాన్ మిలటరీ సంబంధం లేదు. సోషల్ మీడియాని, అడ్డం పెట్టుకుని నాపై విషం చల్లాలని చూస్తున్నారు. నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ఏవేవో ప్రచారం చేస్తున్నారు. నేను ఒక ఇండో అమెరికన్ ని. లాస్ ఏంజిల్స్ లో జన్మించాను.
యుక్త వయసులోనే మా పేరెంట్స్ కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. వాళ్ళు అమెరికన్ సిటిజన్స్. నా విద్యాభ్యాసం అంతా అమెరికాలో జరిగింది.కొరియోగ్రాఫర్ గా నా కెరీర్ ప్రారంభించాను. తర్వాత నాకు ఇండియన్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. నాపై ఇండియన్ సినిమాల ప్రభావం గట్టిగానే ఉంది. నాలో ఉన్న భారతీయ సంస్కృతిని మతం, ప్రాంతాల పేర్లు చెప్పి దూరం చేయకండి.
ఐక్యతకు మారు రూపం కావాలని నేను కోరుకుంటున్నాను. మనం ప్రేమను మాత్రమే పంచాల్సిన సమయం ఇది. చరిత్రలో ఏ విషయం పై అవగాహన కల్పించాలన్నా కళనే ఉపయోగించారు. నాలో ఉన్న ప్రపంచానికి పరిచయం చేయడానికి కష్టపడి పని చేసాను. దయచేసి అంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.