తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎంతటి ప్రభావం చూపారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన 40 సంవత్సరాల కెరీర్ లో తన అద్భుతమైన ప్రయాణం వల్ల ఎంతో మంది సాధారణ ప్రేక్షకులను సినిమాల వైపు ప్రేరేపించి, తన నటనతో మరియు తేజస్సుతో వారిని ఉత్తేజితులను చేసిన తీరు అమోఘం.
చిరంజీవి తన నటనా పటిమకు మాత్రమే కాకుండా డ్యాన్స్లు మరియు ఫైట్స్లో కూడా తనదైన ప్రత్యేకతను కలిగి ఉన్నారు. నటుడిగానే కాకుండా తన సినిమా డైరెక్షన్ మరియు స్క్రిప్ట్ మార్పులలో కూడా పాల్గొంటారని చాలా మందికి తెలుసు. అయితే అలా చేయడం దర్శకుడి పనికి ఉతమిచ్చే ప్రమేయమని కొందరు భావిస్తే, దర్శకుడి పనికి ఆటంకం అని మరి కొందరు అంటున్నారు.
ఒక నటుడు తన సినిమా స్క్రిప్ట్లో భాగం కావడం లేదా సలహాలు ఇవ్వడం సినిమాకి అనుకూలంగా ఉన్నంత వరకు అది అందరికీ సమ్మతమే. కానీ అది సినిమా పై ప్రతికూల ప్రభావం చూపినప్పుడే సమస్య తలెత్తుతుంది. ఇప్పుడు చిరంజీవి విషయంలోనూ అదే జరుగుతోంది.
చిరంజీవి గతంలో స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసిన ఇంద్ర, ఠాగూర్ వంటి మరెన్నో చిత్రాలు ఘన విజయం సాధించాయి. కానీ ఇప్పుడు ఆయన ఇచ్చే ఇన్పుట్లు పాతవిగా కనిపిస్తున్నాయి మరియు ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి అయన ఆలోచనా ధోరణికి ఏమాత్రం పొంతన కుదరడం లేదు.
ఉదాహరణకు, సైరా సినిమా రచయిత పరుచూరి గోపాలకృష్ణ తమ కథలో చాలా మార్పులు వచ్చాయని గతంలో తెలిపిన విషయం తెలిసిందే. ఇక అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం స్క్రిప్టు లోని మార్పుల విషయంలోనే షూటింగ్ టైమ్లో సురేందర్ రెడ్డి మరియు చిరంజీవి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు కూడా వచ్చాయని తెలుస్తోంది.
ఇక ఆచార్యలో, ముందుగా రామ్చరణ్ పాత్ర కేవలం 10 నిమిషాల కోసం రూపొందించబడింది, అయితే చిరంజీవి కొరటాలను ఆ పాత్ర యొక్క నిడివిని పెంచాలని పట్టుబట్టారు. ఆ కారణంగా మొత్తం స్క్రిప్ట్ మార్చబడింది. ఈ అనవసర మార్పుల వల్ల కొరటాల, చిరంజీవి మధ్య చాలా గొడవలు జరిగాయి.
ఇటీవలే చిరంజీవి నటించిన గాడ్ఫాదర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఆ చిత్ర బృందం ప్రకారం, చిరంజీవి సలహాలు బాగా పనిచేశాయి. అయితే లూసిఫర్ని చూసిన చాలా మంది ప్రేక్షకులు మాత్రం గాడ్ఫాదర్ కంటే లూసిఫర్ సెకండ్ హాఫ్ యే బాగుంది అని భావించారు.
స్క్రిప్ట్కు సంబంధించి తన సలహాలు సూచనలను తప్పనిసరిగా ఉపయోగించమని చిరంజీవి దర్శకులను బలవంతం చేయడం దగ్గరే సమస్య వస్తుంది. మెగాస్టార్ వంటి ఇమేజ్ ఉండి, ఇంత అపారమైన అనుభవం ఉన్న చిరంజీవి స్క్రిప్ట్లో ఎప్పుడు మార్పులు చేయాలో.. ఎప్పుడు చేయకూడదో తెలుసుకుని ఆ రకంగా నడుచుకుంటే అందరికీ మంచిది.