మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ఫాదర్ సినిమా విడుదలకు ఇంకా కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. ఇక ఈ చిత్రం తాలూకు ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతోంది. చిత్ర బృందం ఇంటర్వ్యూలు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు మొదలైన కార్యక్రమాలతో భారీ ప్రచారాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు.
అయితే ముందుగా గాడ్ఫాదర్ చిత్ర నిర్మాతలు ఈ చిత్రానికి చాలా ఎక్కువ ధరలను కోట్ చేశారు, అందువల్ల ఎవరూ ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ముందుకి రాలేదు. చిరంజీవి గత చిత్రం అయిన ఆచార్య.. బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన ఫలితం చవి చూసిన తర్వాత, గాడ్ ఫాదర్ సినిమాను భారీ ధరలు పెట్టి కొంటే అసలు లాభదాయకంగా ఉంటుందా అన్న అనుమానంతో డిస్ట్రిబ్యూటర్లు కొంత ఆందోళనకు గురయ్యారు.
ఈ ప్రభావం వల్ల ఈ చిత్రాన్ని అన్ని ప్రాంతాలలో తామే సొంతంగా విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారని వార్తలు వినిపించాయి. తాము అనుకున్న ధరకే సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో వారు ఉన్నట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. కొన్ని కారణాల వల్ల నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకుని సినిమాను సరసమైన ధరలకు అమ్మడం మొదలుపెట్టారని తెలియ వచ్చింది.
నైజాం ఏరియాను ఏషియన్ ఫిల్మ్స్ 25 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక ఆంధ్ర ప్రాంతం మొత్తం 35 కోట్ల ధరకు అమ్మబడింది. ఇక సీడెడ్ ఏరియాలో గాడ్ ఫాదర్ సినిమా own release అంటే సొంతంగా విడుదల అవుతుంది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల బిజినెస్ మొత్తం చూసుకుంటే 73-74 కోట్ల వరకూ ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా 87 కోట్ల మొత్తానికి ఈ చిత్రం బిజినెస్ జరిగింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకులలో మరియు ట్రేడ్ వర్గాలలో చిరంజీవి స్టార్డమ్కి గాడ్ఫాదర్ సినిమా ఒక కీలకమైన పరీక్షగా మారింది. ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలవాలంటే ఎంత లేదన్నా 90 కోట్ల షేర్ ను వసూలు చేయాలి. కాగా గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న మొత్తం 5 భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు.