కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘ బింబిసార’. కేథరిన్, సంయుక్తా మేనన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే అద్భుతమైన స్పందనను మరియు విశేష స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
హీరో గతం నుంచి ప్రస్తుతానికి రావడం.. మరియు కర్మ సిద్ధాంతం పై ఆధారపడి సాగే కథతో వచ్చిన చిత్రం బింబిసార. రావణాసురుడు, కీచకుడు, భకాసురుడు లాంటి రాక్షసులను మించిన రాక్షసుడైన బింబిసారుడు.. చివరికి ఒక మహోన్నత వ్యక్తిగా ఎలా మారాడన్నది ఇందులో కథాంశం. కాగా ఈ సినిమాలో కల్యాణ్రామ్ రెండు భిన్నమైన పార్శ్వాలు ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు.
500 ఏళ్ల క్రితం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిగర్తల అనే సామ్రాజ్యాన్ని దర్శకుడు సృష్టించిన తీరుకు ప్రేక్షకులు ఎంతగానో ప్రభావితం అయ్యారు. ఆ కాలానికి తగ్గ సెట్స్, గ్రాఫిక్స్ తో చక్కని అనుభూతి కలిగించడంలో దర్శకుడు సఫలం అయ్యారు. అయితే ప్రేక్షకులను ఇంతగా ఆకట్టుకున్న దర్శకుడు మల్లిడి వశిష్ట మరో అరుదైన అవకాశం అందుకున్నారు అని సమాచారం.
నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఆసక్తికరమైన కాంబినేషన్లో వస్తున్న సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక నటసింహ నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుంచో ‘ఆదిత్య 369’ కి సీక్వెల్ తీయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి కొన్ని సార్లు పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. ఓ సందర్భంలో ” సింగీతం గారు కథ సిద్ధం చేస్తే నేనూ సిద్దంగానే ఉన్నాను” అని బాలయ్య ఓపెన్ గానే చెప్పారు.
బాలకృష్ణ -ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావు కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆదిత్య 369’ 1991 లో విడుదలై తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప సినిమాలలో ఒకటిగా నిలిచింది. అప్పటి కాలానికి ఎంతో ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించి ఆకట్టుకున్నారు దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు.
ఇక బింబిసార చిత్రాన్ని తరువాత సీక్వెల్ గా రెండు మూడు భాగాలుగా తీస్తున్నట్లుగా కళ్యాణ్ రామ్ – దర్శకుడు వశిష్ట ఇది వరకే చెప్పారు. మరి బాలకృష్ణతో చేయబోయే సినిమా బింబిసార యూనివర్స్ లో భాగంగా ఉంటుందా లేక వేరే ప్రత్యేకమైన సినిమాగా తీస్తారా అన్నది వేచి చూడాలి.