ఈ ఏడాది తెలుగు సినిమా పరిశ్రమ నుండి వచ్చిన సూపర్ హిట్ చిత్రాలలో “డీజే టిల్లు”సినిమా ఒకటి. చిన్న సినిమాగా విడుదలైనా, ‘డీజే టిల్లు’ బాక్సాఫీస్ వద్ద అందరికీ లాభాలు తెచ్చి పెట్టింది. సిద్ద జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.
లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, గుంటూరు టాకీస్, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్ హిజ్ లీల వంటి చిత్రాలలో నటించిన సిద్ధు జొన్నల గడ్డ.. నిజానికి పదమూడేళ్ళ క్రితం విడుదలైన నాగ చైతన్య తొలి చిత్రం అయిన “జోష్” చిత్రంలో ఒక పాత్రలో తెరంగేట్రం చేశారు.ఆ తరువాత రామ్ చరణ్ హీరోగా చేసిన “ఆరెంజ్” సినిమాలో సహాయక పాత్రలో నటించారు. అలా అడపాదడపా చిన్న పాత్రలు, అలాగే హీరోగా నటిస్తూ వచ్చిన సిద్ధు గత ఏడాది ఓటీటీలో విడుదలైన “కృష్ణ అండ్ హిజ్ లీల” చిత్రంతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక ఈ యువ హీరోకు ‘డీజే టిల్లు’ సినిమాతో ఇన్నేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో పేరొచ్చింది. ‘డీజే టిల్లు’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే సినిమాకి మంచి హైప్ ఉన్నప్పుడే సీక్వెల్ కూడా ప్రకటించి ప్రేక్షకులను ఆనంద పరిచారు దర్శక నిర్మాతలు.
అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘డీజే టిల్లు’ దర్శకుడు విమల్ కృష్ణ ఈ సీక్వెల్ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా సీక్వెల్ ప్రారంభమైన తర్వాత దర్శకుడు విమల్, హీరో సిద్ధు మధ్య స్క్రిప్ట్ విషయంలో అభిప్రాయ భేదాలు చోటు చేసుకున్నాయట. అందువల్ల దర్శకుడు విమల్ కృష్ణ ఈ సీక్వెల్ నుంచి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు ఈ సీక్వెల్కు హీరో సిద్ధు నే స్క్రిప్ట్ సరిదిద్దే భాద్యతలు చూసుకుంటున్నారట. ఇదివరకు “కృష్ణ అండ్ హిజ్ లీల” “మా వింత గాథ వినుమా” సినిమాలకు కూడా స్క్రిప్ట్ వర్క్ లో సిద్ధు పాల్గొన్నారు. ఇప్పుడు దర్శకుడు విమల్ స్థానంలో కొత్త దర్శకుడు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో డీజే టిల్లు చిత్ర యూనిట్ నుండి ఈ విషయం పై ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం.