హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కేంద్రం తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి కేంద్రాల్లో ఒకటి. తెలుగు హీరోల అభిమానులు ఎప్పుడూ ఈ కేంద్రంలోని రికార్డుల గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇటీవల నందమూరి బాలకృష్ణ అభిమానులు తమ సొంత డబ్బు వెచ్చించి వీరసింహారెడ్డి సినిమా కోసం ఇదే సెంటర్ లో కోటి రూపాయల గ్రాస్ మార్కు అందుకునేలా చేయగా, ఇప్పుడు వాల్తేరు వీరయ్యకు మెగా అభిమానుల వంతు వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఆర్టీసి క్రాస్ రోడ్స్ లో సింగిల్ థియేటర్ లో కోటి గ్రాస్ మార్కును దాటేలా మెగా అభిమానులు తమ సొంత డబ్బును వెచ్చించారు. ‘సంధ్య 70 ఎంఎం థియేటర్’లో విడుదలైన ఈ చిత్రం నిన్నటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే 50వ రోజు దగ్గర్లోనే కోటి మార్కుకు చేరువలో వచ్చింది. అందుకే ఈ సినిమా కోటి గ్రాస్ మార్కును దాటేలా, 50 వ రోజు హయ్యస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ను కూడా క్రాస్ చేసేలా అభిమానులు దాదాపు 2 లక్షల వరకు ప్లాన్ చేసి ఖర్చు పెట్టారు.
థియేటర్, సెంటర్ రికార్డుల కోసం అభిమానులు తమ సొంత డబ్బును ఖర్చు చేయడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు, గతంలో దాదాపు అందరు అభిమానులు ఇలా చేశారు. నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాకు కూడా అభిమానులు అదే పని చేశారు.
ఇక వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ చిత్రం, 69 డైరెక్ట్ సెంటర్లలో 50 రోజులు జరుపుకోవడం ద్వారా మరో రికార్డును తన జేబులో వేసుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చిరంజీవి కెరీర్ బెస్ట్ కలెక్షన్లను రాబట్టి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకీ లేని విధంగా ఈ సినిమా బెస్ట్ రన్ తెచ్చుకుంది.