తెలుగు చిత్ర పరిశ్రమ ఇటీవలి కాలంలో అనేక ల్యాండ్ మార్క్ పాన్ ఇండియా ప్రాజెక్టులను అందించింది మరియు ఇంకా అలాంటి భారీ ప్రాజెక్టుల రూపంలో మరిన్ని సినిమాలు రానున్నాయి. బాహుబలి ఫ్రాంచైజీ తన విజయంతో టాలీవుడ్ లో గ్రాండియర్ పరంగా, భారీ రిలీజ్ ల పరంగా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది.
అయితే బాహుబలికి నిజంగానే భారీ బడ్జెట్ అవసరమయింది. కాగా విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్ల పరంగా ఆ సినిమా ఎంతటి ఫలితాన్ని ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఆ ఒక్క సినిమా వల్ల ప్రతీ సినిమాకు అవసరం ఉన్నా లేకపోయినా భారీతనం జోడించడం అలవాటు అయిపొయింది.
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, సాహో, సైరా నరసింహారెడ్డి, పుష్ప వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు చక్కని విజయాలు సాధించగా.. మరికొన్ని అనుకున్న స్థాయిలో తమ ప్రభావం చూపలేకపోయాయి.
ఇండస్ట్రీలో సక్సెస్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా వరకు టైర్ 2 హీరోలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యారు. అగ్ర హీరోల సినిమాలు కూడా ఇబ్బంది పడ్డాయి కానీ నిర్మాతలు నట్టం బడ్జెట్ విషయంలో రాజీ పడటం లేదు. మీడియం బడ్జెట్ సినిమాలు కూడా నాన్ థియేట్రికల్ రైట్స్ 40 కోట్లకు పైగా బిజినెస్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం.
తెలుగు ఇండస్ట్రీలో 60 కోట్ల నుంచి 70 కోట్ల ఖర్చు అనేది ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమాకు సర్వ సాధారణంగా మారిపోయింది. ఇక అగ్ర హీరోల సినిమాలకు మినిమమ్ బడ్జెట్ 200 కోట్లు కాబట్టి హీరోలే దాదాపు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మొత్తంగా రోజురోజుకూ బడ్జెట్లు పెరుగుతున్నా సక్సెస్ రేట్ ఇంకా తక్కువగానే ఉండటంతో నిర్మాతలు ఇరకాటంలో పడ్డారు.