అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ చిత్రం గత సంవత్సరం డిసెంబర్లో విడుదలై భారతదేశాన్ని ఒక్క ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. తొలిరోజు కాస్త మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక అప్పటి నుండి, పుష్ప పార్ట్ 2 కోసం ప్రేక్షకులలో హైప్ మరియు ఉత్కంఠ తీవ్ర స్థాయిలో ఉంది. కాగా ఎప్పుడెప్పుడు ఈ సీక్వెల్ చిత్రానికి సంభందించిన మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పుష్ప ది రూల్ చాలా కాలం క్రితమే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉన్నా, వివిధ కారణాల వల్ల ఈ చిత్రం తాలూకు షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
పుష్ప: ది రైజ్ సినిమాలో శ్రీవల్లిగా కీలక పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక మందన్న, పుష్ప రెండవ భాగానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలతో మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో పుష్ప ది రూల్ షూటింగ్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుందని ఆమె తెలిపారు.
ఇదిలా ఉండగా, ఈరోజు పుష్ప ది రూల్ సినిమాకు సంభందించిన ఒక ఫోటో షూట్ జరిగింది. కాగా ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త లుక్ లో కనిపించబోతున్నారట. ఆ లుక్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. కొన్ని కొత్త పాత్రలను జోడించడంతో పాటు మొదటి భాగంలో నటీనటులను ఈ చిత్రంలో అలాగే కొనసాగించనున్నారు.
సునీల్, అనసూయ, డాలి దనంజయలు మొదటి భాగంలో చేసిన పాత్రలలోనే రెండవ భాగంలోనూ కనిపించనున్నారు. ఇక పుష్ప ది రూల్ చిత్రం ప్రధానంగా ఫహద్ ఫాసిల్ మరియు అల్లు అర్జున్ ల ఇగో వార్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. కాగా పుష్ప: ది రూల్ సినిమాలో మరి కొంతమంది కొత్త నటీనటులు కూడా జోడించబడతారని తెలుస్తొంది.
కాగా ఈ చిత్రాన్ని ఎక్కువ కాలం ఇండోనేషియా మరియు సింగపూర్లోని లొకేషన్లలో భారీ స్థాయిలో చిత్రీకరించాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప ది రైజ్ కి వచ్చిన అత్యంత జనాదరణ కారణంగా, సీక్వెల్ ను తెరకెక్కించే విధానంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.